Wednesday 1 July 2015

                            పండిన వృధాప్యంలో,కూతుర్ల పెళ్ళిళ్ళన్ని ఐపోయి, ఒంటరిగా,(మా

 అమ్మగారు గతించారు) అలా కడపలో, మా ఇంటి అరుగుపై 

కూర్చుని,ఉండేవారు మా అయ్యగారు! హడావిడిగా (ఒక రకంగా కొంపలు

 మునిగిపోతున్నాయేమోనన్నాట్టు-మా అయ్యగారి మాటల్లోనే) ఉదయం 

నుంచీ పరుగులు పెడుతున్న జనాలను నిర్వేదంగా చూస్తూ- అనేవారు- 

'ఇన్ని గ్రంధాలు, ఎందుకు చదివానా,ఎందుకింత పరిశ్రమ మెదడుకు పెట్టానా 

వృధాగా అనిపిస్తుందీ! అనవసర శ్రమ!ప్రపంచంలో యెవడికీ పట్టని యీ 

జ్ఞానమంతా నేనొక్కడినీ యేమి చేసుకోను? అందరివలె యేదో కూడూ గుడ్డా 

కోసమే పాటు పడి ఉంటే ఆర్థికంగానైనా యేదొ కాస్త 

బాగుపడిఉండేవాణ్ణికదా? 

నా బుర్ర పజీతు (కడప ఉర్దు మాండలికం-గందరగోళం అనవచ్చు)

లేచిపోయిందిట్లా!! నా యీ పనికిమాలిన జ్ఞానం యీ రోజుల్లో యెవడికి

కావాలప్పా' అని!'' వారి మాటల్లోని వేదన, కళ్ళల్లో నీళ్ళు తెప్పించేది! 

అలాంటి మా అయ్య దగ్గరే కూర్చుని, యేవో పిచ్చి ప్రశ్నలు వేస్తూ

కూర్చున్నా, యెంత పరిజ్ఞానం అబ్బేదో, యీ వ్యావహారిక ప్రపంచ 

పరిజ్ఞానానికే, జీవనోపాధికే ప్రాధాన్యత ఇవ్వకుండా! అన్న పశ్చాత్తాపం

కలిగినా,పెళ్ళైన ఆడపిల్లగా పుట్టింట్లోనే ఉండటం వారికీ ఇష్టంలేదు కనుక 

మళ్ళీ బయలుదేరవలసే వచ్చేది నిస్సహాయంగా! 

  మా అయ్యగారి మాటల్లోని యీ  వేదనకు ఎంతో నేపథ్యం ఉంది మరి!!


  నా వివాహమై 34 సంవత్సరాలైంది. అయ్య పరిశ్రమ కళ్ళారా చూసిన

 గుర్తులిప్పటికీ మనస్సులో గూడు కట్టుకునే ఉన్నాయి. వారి గదిలోని

 గ్రంధలన్నిటికీ, నంబర్లు వేసి, వాటి ప్రక్రియల ప్రకారం సర్ది పెట్టటం ఎంతో 

ఇష్టంగా చేసే పని నా చిన్న తనాన! వాటిని,  భాషా పరంగా విభజించటమూ 

వుండేది. ఒక ట్రంకు పెట్టె లో అయ్య స్వహస్తాలతో వ్రాసుకున్న నోటు

 పుస్తకాలు చాలా ఉండేవి.వాటిలో చాలా వరకూ, వారు, ఆయా గ్రంధలను

, తాను మళ్ళి తన దస్తూరీలో వ్రాసుకున్నవే కాక, వివిధ భాషల శబ్ద

 కోశాలూ ఉండేవి. అన్నీ నీలం, ఆకుపచ్చా, యెర్ర సిరాతో ప్రత్యేక శ్రద్ధతో

 వ్రాసుకున్నవి. అవన్నీ చూస్తుంటే,  అయ్య శ్రమలోని అంతరార్థం  వెనుక

 నాకు అంతు పట్టని మర్మమేదో ఉందనిపించేది. పది సార్లు చదవటం కంటే 

ఒక సారి వ్రాయటం వల్లే యెక్కువ ప్రయోజనం ఉంటుందనీ, అలా 

వ్రాసుకోవటం,  కేవలం పుస్తకంలోనే కాదు, బుర్రలోనూ వ్రాసుకున్నట్టే అని 

పెద్దలంటూనే ఉంటారు కదా మరి! యెన్నెన్ని గంటలు వారల వ్రాసుకుని 

ఉంటారో లెక్క వెస్తే యెంతో ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికీ! 

అయ్య కీర్తికాయులైనప్పుడు వారి కొన్ని వ్రాత పుస్తకలను నాతో అత్త 

వారింటికి తెచ్చుకున్నను. వాటిలో, అయ్య సంగీతాభ్యాసం  కోసం 

వ్రాసుకున్న వర్ణాలూ, కీర్తనలూ మొదలు, జతులూ, మృదంగ వరుసలూ 

ఉన్నాయి. ఇంకా, తమిళ రచనలూ (అర్థ తాత్పర్యలతో సహా) కన్నడ

సాహిత్యం, విజయ నగర రాజులూ, విద్యారణ్యులూ, అన్నమయ్యా, 

తిరుప్పావై, రాసపంచాధ్యాయి వివరణ,  ఇంకా చాలానే ఉన్నాయి. ఇలా 

కసిగా,వారి మాటల్లోనే మరీ  రాక్షసంగా,ఎంతో శ్రమించి 

తానుసంపాదించుకున్న


 జ్ఞానాన్ని  యెవరికి పంచి పెట్టాలి? అసలు ఆసక్తి యెవరికుంది? 

యెవరితోనైనా ముచ్చటించాలంటే ఆ విధమైన అభిరుచి


 యీ వేగ నాగరికత వ్యామోహం లో కొట్టుకుపోయే తరానికి అంత తీరికేదీ? 

యెప్పుదూ సినిమాలూ,

 టీ. వీ కార్యక్రమాలూ  (1980-90 నాటికే టీ.వీ.ప్రాధాన్యత పెర్రిగిపోతున్న

 రోజులవి)  

   అందుకే అలా నిరాశ ధ్వనించేది వారి మాటల్లో! 

   నేను, అయ్య గ్రంధాలు కొన్నిటిని పునర్ముద్రించి నా వంతు సేవ 

చేసుకున్నాను. ఇంకా ఆ వ్రాత ప్రతులను

 చూస్తుంటే వీటిని యధాతథంగా కనీసం, యీ బ్లాగ్ లోనైనా పెడితే, 

యెవరికైనా ఉపయోగపదుతాయి 

కదా అనిపిస్తోంది. ఆ పని త్వరగా చేయాలి.. వాటిని ఉపయోగించుకునే తరం

 ముందెప్పుడైనా   

వస్తుందన్న ఆశ ఉంది. ఆశే మనిషికి సగం ఆయుస్షు కదా మరి!!




                      


No comments:

Post a Comment