Saturday, 13 February 2016

Alarulu kuriyaga adenade.....by Tallapaka Annamacarya







ఈ రోజు ప్రేమ దినోత్సవం. నిన్నటి నా పుస్తక శోధనలో బయటపడిన 12,మే 1982 నాటి ఆంధ్ర ప్రభ ప్రత్యేక సంచిక (వారపత్రిక) లో చిన తిరుమలయ్య వ్రాసిన శృంగార మంజరిలొని యీ ముచ్చటగొలిపే వివరణ చూడండి.






గాలిపటాలలో, కస్తూరిలో అద్దిన లేఖినితో ప్రేమలెఖ వ్రాసిన ఆ నాయకి వర్ణన యెంత మనోజ్ఞం!
యేమొకో చిగురుటధరమున.....ఇదీ అంతే!
 రుక్మిణీదేవి కూడా, శ్రీకృష్ణుని వలచి ప్రేమలెఖ పంపింది కదా మరి!
అన్నమయ్య అలమేలు మంగ, తన పతి మనసు గెలుచుకునేందుకు, అరతెర మరుగున నుంచీ నాట్యం చేసిందని అన్నమయ్య అంటాడు అలరులుగురియగ ఆడెనదే..అన్న పదంలో!
 అప్పటి రోజుల్లో, వీధినాటకలలోనో మరెక్కడో,(అప్పటికి భామాకలాపం వుండేదా?)
 తెరమరుగు నుండీ నాయిక పాత్ర ప్రవేశించే విధానం అన్నమయ్య రచనలో ప్రతిబింబించిందని అయ్య చెప్పినట్టు గుర్తు - నాచేత శ్రీ రామకృష్ణాహైస్కూల్ లో యీ పాటకు నాట్యం చేయించినప్పుడు!
మా తులజక్కయ్య, బాలసరస్వతిగారి నాట్యాభినయ గ్రంధాన్ని దగ్గర పెట్టుకుని, ముద్రలూ అవీ అయ్య సూచనల ప్రకారం నాకు నేర్పించింది.
   'కందువ తిరువెంకతపతి మెచ్చగా అన్న చోట, దశావతారాలూ యివిధంగా అభినయించమని చెప్పి చెసి చూపించారు అయ్య స్వయంగా! .
ఇక ప్రదర్శన తరువాత, మ అయ్య నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నరు - మురిపెంగా! అమ్మ ఇంట్లో దిష్టి తీసింది! 
 అయ్యో..కేవలం స్మృతి పటలంపై మాత్రమే రికార్డ్ చేసుకోగలిగానే, అని ఇప్పుడు యెంత ఆవేదనో!
 అప్పటి ఫోటొలు కూడా యేవీ లేకపోవటం - యెంతటి తప్పిదం కదా! (ఆ పాట ఇప్పటి నా గానంలో _ శంకరాభరణ రాగం)




 ............................
అలరులు కురియగ నాడెనదే |
అలుకల గులుకుల అలమేలు మంగ || అరవిరి సొబగుల నతివలు మెచ్చగ | అరతెర మరగున నాడెనదే |వరుస పూర్వదువాళపు తిరుపుల | హరిగరగింపుచు అలమేలు మంగ ||మట్టపు మలపుల మట్టెల కెలపుల | తట్టెడి నడపుల దాటెనదే |పెట్టిన వజ్రపు పెణ్డెపు తళుకులు | అట్టిట్టు చిమ్ముచు అలమేలు మంగ ||
చిందుల పాటల సిరి పొలయాటల | అందెల మోతల నాడెనదే |కందువ తిరువేఘ్కటపతి మెచ్చగ |అందపు తిరుపుల అలమేలు మంగ ||....
.............................




Friday, 12 February 2016

Veena vadini varde! var de! (Nirala)






                     మా అయ్యగారికి హిందీ కవులలో నిరాలా అంటే యెందుకో చాలా ఇష్టంగా వుండేది. ఒకనొక ఇంటర్వ్యూ లో వారన్నారు..'నాకూ, నిరాలాకూ చాలా పోలికలున్నందువల్లేనేమో, అతనంటే, నాకు మహా ఇష్టం. అతనూ నావలెనే చాలా కష్టపడినాడు జీవితంలో. ధనాభావంతో, నిష్టుర దారిద్ర్యంతో చివరి రోజుల్లో, ఆయన బిడ్డకు జబ్బు చేస్తే పాపం సరైన వైద్యమూ చేయించలేక పోయినాడు. ప్రపంచంలో దారిద్ర్యంకంటే మించిన పాపం లేదేమోననిపిస్తుంది. ఇప్పుడు ఆయన రచనలకు నీరాజనాలర్పిస్తున్నారు.' (నేను 2002 లో ప్రచురించిన 'సరస్వతీపుత్రునితో సంభాషణలు' పేజీ 38)


       నిరాలా వ్రాసిన 'రాం కీ శక్తి పూజా'  మాకు ఎం. ఏ. లో వుండేది. యెన్నిసార్లు చదివి వుంటానో లెక్కలేదా రచనను! ఆధ్యాత్మ రామాయణ ప్రభావం బాగా కనిపిస్తుందందులో!







 (అరుణ్ రామాయణ్ అన్న అరుణ్ పోద్దార్ హిందీ రామాయణం చదివినప్పుడూ నేనిలాగే యెంతో వుద్వేగానికి గురైనాను. నేను సౌందర్య లహరి బాగా పారాయణం చేసేదాన్నప్పట్లొ. మొదటిరొజు మొదటి శ్లోకం 108 సార్లు చేసి, తక్కిన శ్లొకాలన్నీ చదివేయటం. రెండొ రోజు రెండవ శ్లొకం 108 సార్లు. మూడో రోజు మూడవ శ్లోకం- అలా, నూటా యెనిమిది శ్లోకాలూ, 108 రోజుల్లో పారాయణం చేయమని అమ్మ ఇచ్చిన సలహాను నేను అలా దీక్షగా చేస్తుంటే అయ్య కూడా యెంతో ఇష్టంగా గమనించేవారు కూడా! అప్పుడు అమ్మా, అయ్యా యేంచెబితే అవి చేయటమే, జీవిత లక్ష్యాలు అప్పట్లో! .) 
       నిరాలా వ్రాసిన యీ సరస్వతీ వందన పాడాలని యెన్ని రోజులుగానో అనుకుంటున్నాను. రేపు మాఘ పంచమి. సరస్వతిదేవి మా నాయనమ్మ. ఆమెకు ప్రణమిల్లుతూ రికార్డ్ చేశాను మరి! (అభేరి రాగ చాయలతో) మా అయ్య ఇంకా వాళ్ళమ్మ దగ్గరే కూర్చుని, తన కావ్యగానం చేస్తూనే వున్నారో, లేదూ, అమ్మ ఆశీర్వాదంతో, యెక్కడైన అవతరించి వుంటారో, తెలియదు. యీ నా జన్మకు యీ కృప చాలునంటారేమో మరి!
......................  

Wednesday, 10 February 2016

Jalaja Nayana... A sweet Sanskrit Mangala Harathi





                      ఆనంద భైరవి
......................
ఈనాడు మనకందరికీ  మైసూర్ గా చిర పరిచితమైన ఆ నగరాన్ని, ఇదివరకు, అంటే పాత కాలంలో యేమని పిలిచేవారో తెలుసా? మహీశూర పురం! యెంత బాగుంది కదా! ఆ మహీశూర పురంలోనే శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన ప్రాచీనమైన పరకాల మఠం వుంది.(నేను మైసూరుకు ఉద్యోగంలో వున్నప్పుడు రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళి, ఆ పూర్వ వైభవాన్ని దర్శించి,  ధన్యురాలై వచ్చాను)  మరి ఇప్పుడా ప్రసక్తి యెందుకంటే, ఆనంద భైరవి రాగం లోని యీ మంగళహారతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ బ్రహ్మ తంత్ర పరకాల మహాదేశికుల వారు  (వీరు పరకాలమఠ యేకత్రింశనాం స్వామివారు-31వ పీఠాధిపతి) తన పూర్వాశ్రమంలో రచించినది. నా చిన్నప్పుడు, యీ మంగళహారతిని, మా అమ్మ, శ్రీమతి కనకమ్మా, మా అక్కయ్యలు కరుణ, తరులతల యుగళగళాలలో యెన్నో సార్లు విన్న అందమైన  జ్ఞాపకం యీనాడీవిధంగా మీముందుకు తీసుకువస్తున్న సంతోషం! నోరు తిరిగేందుకు, గాదె కింద కంది పప్పు...ఇంకా... నల్ల లారి మీద యెర్ర లారీ...ఇలాంటి ప్రయోగాలేమంటారొ మరిచిపోయానిప్పుడు కానీ యీ పాటలోని పదాలను క్షుణ్ణంగా,  తప్పులు లేకుండా పలకడం అంత  సులువేంకాదు సుమా! ఒక సారి ట్రై  చేయండి మీకే తెలుస్తుంది! సంస్కృత రచనే ఐనా, ద్రాక్షాపాకమండీ! యెంత మధుర పదజాలం! యెంత చక్కటి భావం! ముందు రచన చూడండి. తరువాతే పాట వినండి  దయచేసి.....(   'కల్యాణ గీత మంజరి'   పేరుతో 1966లొ ముద్రితమైన యీ చిన్ని పొత్తాన్ని, పుట్టింటి ఆస్తిగా వెంట తెచ్చుకున్నాను - యెప్పుడో.! .యేమిటో..నా  పిచ్చి నాకు ఆనందం!)
........................
 జలజ  నయన  తవసు మంగళం
   భుజగ శిఖరి,   కలిత నిలయ  భవతు మంగళం....
   జలధి  శయన  విబుధ   వినుత  లలిత  లలిత  చరిత  భరిత
   వలభి  దుపల  పటల  రుచిర  చలిత  లులిత  చికుర  నిటిల...
                     .జలజ  నయన  తవసు మంగళం
                      భుజగ శిఖరి  కలిత  నిలయ  భవతు  మంగళం...
శరణ  వరుణ  కుతుకి దేవతా
     భరణ రుచిత.. కరుణ నిగమ  సుగమ  దైవతా..
     అరుణ తరుణ  తరుణి  కిరణ
    చరణ  చరణ హరిణ  హరణ 
    హరిణ  కిరణ  వదన  జనన
   సరణి  తరణ  కరణ  శరణ...
             .జలజ  నయన  తవసు మంగళం
             భుజగ శిఖరి  కలిత  నిలయ  భవతు  మంగళం.....
 సురత  మృదిత  జలధితాస్తనా..
     భరత సహజ
    హరిత  తురగ  తనుజ  పాలనా..
   స్ఫురద  విరత సతత కఠిన
    విరుత భువన కదన జనన
    దురిత భరిత  చరిత  సదన
    నిఋతి  వితతి విరతి లకన 
                          .జలజ  నయన  తవసు మంగళం
                           భుజగ శిఖరి  కలిత  నిలయ  భవతు  మంగళం..
 పవన  తనయ  వినుతి  భాజనా 
      పవన  హరణ 
      నవన  వచన  నివహ  పావనా..
     పవన  లవన  యవన  గహన 
     జవన  వలన  వహన  పవన 
     నవ  సుదుర్గ  భవన  కృష్ణ 
     కవన  సరణి  జవన  చరిత...
                      .జలజ  నయన  తవసు మంగళం
                      భుజగ శిఖరి  కలిత  నిలయ  భవతు  మంగళం..
.

Saturday, 6 February 2016

Kadaku migiledi.....Dr.Puttaparthi's Devotional (non-denominational) song








7-2-16
................

అయ్యకూ, అయ్య అభిమనులకూ- అందరికీ యెంతో ఇష్టమైన భక్తిగీతమిది. ఒక విధంగా, జీవిత సారాన్నంతా, మూడు చరణాల్లో విశదపరచే యీ భక్తి గీతం-1970లలో, ఆకాశవాణి హైదరాబాద్ వారి కోరికపై అయ్య రాశారు. శ్రీ పాలగుమ్మి విశ్వనాధం గారి సంగీత నిర్వహణలో, హైదరబాద్ సోదరీమణులుగా విఖ్యాతులైన శ్రీమతి లలిత, హరిప్రియ గారలు గానం చేశారు. యెంతో అర్థవంతమైన యీ పాట, రికార్డింగ్ ను సరైన రీతిలో, భద్రపరచలేకపోయినందుకు, వ్యక్తిగతంగానూ, ఆకాశవాణి ఉద్యోగినిగానూ, యెంతో బాధపదుతున్నా, నాకు వచ్చినరీతిలో, ఇలా మీముందుంచగలుగుతున్నందుకు లేశమాత్రం సంతోషంగా ఉంది. ఇదిగో సాహిత్యం-మీకొసం.....

కడకు మిగిలేది ఇది ఒకటే,

యెడద జపించిన భగవన్నామము..కడకు...

అష్టైశ్వర్యములమరినగానీ,

ఆచారమ్ములు నెరపిన గానీ,

అఖిల శాస్త్రములు చదివిన గానీ,

ఆహా! యను యశమమరినగానీ...కడకు...

హఠయోగమ్ములు బట్టినగానీ,

ఆశ్చర్యంబులు చూపినగానీ,

అతివలకన్నుల క్రీనీడలలో,

ఆత్మార్పణములు చేసినగానీ...కడకు..

ఆకాశంబులు గొలిచినగానీ,

అబ్ధి జలము శోధించినగానీ,

చంద్రలొకమునకేగినగానీ,

సకలజగముతానేలినగానీ..కడకు...












Friday, 5 February 2016

   (Ayya with Dr.Tripuraneni Hanuman Choudary garu in the backdrop of the main door I painted - might be in 1975 or '76)

...............
'ఆ.. నాగా..ఇదిగో....
 (11-1-16 .. పోస్ట్ తరువాయి....)
        యీ ప్రభ మూడు నాలుగేళ్ళు నడిచిందనుకుంటా!  అయ్య '72లో రెటైర్  అయ్యారు.  మా అన్నయ్య అరవింద్ జీతం  పెద్దగా వుండేది కాదు ఇంటి అవసరాలు ఆదుకునే స్థాయిలో!  ముగ్గురు పెళ్ళిల్లైన అక్కయ్యలూ,  వాళ్ళ అవసరాలూ..అబ్బో! రోజులెట్లా గడిచెవో మరి!  యీ లోగా అయ్యకు పద్మశ్రీ రావటమూ, సంజీవరెడ్డిగారు కడప   కలెక్టర్ గా  వచ్చినప్పుడు, అయ్య షష్టి పూర్తి పెద్ద యెత్తున జరిగి ఓ ఇరవై ఐదు వేల రూపాయల పర్స్ (సరిగ్గా  గుర్తులేదండీ..ఐనా అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు అప్పట్లో) ఇవ్వటమైంది. జిల్లెళ్ళమూడి అమ్మ కరుణతో, చీరాలా, పేరాలా (అప్పుడు అయ్యతో నేనూ వెళ్ళానండొయ్ అక్కడికంతా!)  అటు వైపు బాగా  సన్మనాలవీ జరిగి రెక్కలు అల్లార్చుకునే సమయానికి  అమ్మ తీవ్ర అనారోగ్యం! మాటి మాటికీ, ఆసుపత్రి పాలు  కావటం, డబ్బు నీళ్ళలా ఖర్చైపోవటమూ! ఆ రోజులు తలచుకుంటే కడుపులోంచీ యేడుపు యెగదన్నుకుని వస్తుంది. ఆర్థిక స్థోమత అవసరం అప్పుడప్పుడే తెలుస్తున్న రోజులవి!
       తరువాతి కాలంలో, అయ్య తన పెద్ద రచనలు పండరీభాగవతమూ ,  జనప్రియ రామాయణమూ, వేసుకున్నారు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడి రేట్లతొ ఇచ్చిన పేపర్తో కాస్త ధైర్యంగానే!  కానీ, అప్పటికే, తెలుగు సాహిత్యభిలాష మసకబారుతున్నట్టుందేది. ఆ గ్రంధాలెవరూ గ్రంధాలయాలకంటూ కొనలెదు.పండరీభాగవతం, చెక్క బీరువాల్లో  వుండటం వల్ల, వర్షపు నీళ్ళు దిగి, చెదలు పట్టి పోయాయి చాలా  కాపీలు!..అయ్య ఆ చెదలు పట్టిన పుస్తకాల మధ్య కూర్చుని నిర్వేదంగా, యే భావమూ ప్రకటించని గాజు కళ్ళతో,  అన్న మాటలు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి 'చివరికి,  నా  పండరీభాగవతాన్ని చెదలే చదివినాయన్నమాట  ప్రీతిగా! ' అని! 
      అట్లా, అయ్యకు తన పుస్తకాలను తానే  ముద్రించుకోవటం కూడా తప్పేనని  తెలుసుకునే వేళకు జరగాల్సిన నష్టం జరిగేపోయింది. జనప్రియ రామాయణం,  శ్రీనివాస ప్రబంధమూ, అయ్య పోయిన తరువాత, కొన్ని బ్రౌన్ లైబ్రరీకీ, కొన్ని..(యేడుపొస్తూంది) రక రకాలుగా  మాయమైపోయాయి.. . పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు,  అయ్యను చూసిన స్ఫూర్తి తో, నేనూ  యీ ప్రచురణ రంగంలోకి, అయ్య పుస్తకాలను  ప్రచురిస్తూ, ఆడ అభిమన్యునిగా ప్రవేశించాను. నేను వేసిన పుస్తకాలవల్ల,  లాభాలెన్ని వచ్చాయన్నది  కేవలం  అనుభవైక వేద్యమే !   వ్యాపార   చతురత ముఖ్యంగా వుండవలె కదా! వుద్యోగినులుగా వుంటూ, ప్రచురణ రంగంలో కూడా ప్రతిభ కనబరుస్తూ, సక్సెస్  సాధించిన  మహిళలు, చాలా  తక్కువే యెలాగైనా! యేమైనా చెప్పండి అదిప్పటికీ నాకు  రాని కళే! యేమైనా మాట్లాడేవాళ్ళని 'మీరూ పుస్తకాలు వేసి చూడండి, తెలుస్తుంది ఆ బాధేమిటో ' అనేస్తాను నేనైతే!   గట్టుపై కూర్చుని యెన్ని మాటలైనా మాట్లాడవచ్చు. దిగితే కదా లోతు తెలిసేది. అక్కడో  వూబే ఉండొచ్చు. మొసలే వుండొచ్చు. సుడిగుండమే కావచ్చు. యేమీ లేకపోనూ వచ్చు. అదంతా  అదృష్టం.. యెంతకూ దృష్టం కానిది మరి!   పుస్తకాలు వేసి అమ్ముకోవటానికి నానా  తిప్పలూ,  నానా  గడ్డీ తింటూ అగచాట్లూ పడుతున్న వాళ్ళకే యీ విషయాలు తెలుస్తాయి.  పైగా అయ్యనుంచీ, వారసత్వంగా వచ్చిన కొన్ని సుగుణాలుండనే  వున్నాయాయె! చొరవ   లేదు.  వుద్యోగస్తురాలినైనా, లంచాలిచ్చి పనులు చేయించుకోవడమన్న  విద్య రాకపాయె!  పుచ్చుకునే విద్య ఒస్తే, ఇచ్చే విద్యా వస్తుందట! అదే రాదు కదా మరి! యేమి మాట్లాడినా అయ్యకే చెడ్డపేరొస్తుందనే భయమూ!  ఐనా, కిందపడి దెబ్బ తగిలినా, అనుభవం మాత్రం చక్కటిదే, అన్నట్టు, పుస్తకాలమాటెటున్నా,    పుట్టపర్తాయన బిడ్డగా,  వచ్చిన గుర్తింపే యీ జన్మకు చాలు అన్నట్టుంది నాకైతే! యేమంటారు?   
............................
     

Thursday, 4 February 2016

Dari kace Sabari - A Telugu Devotional song







 సరస్వతీపుత్రుని అంతర్వాహిని :


....................


దారి కాచె శబరీ రాముండిటు వచ్చుననీ...


తన పూజ గొనునటంచు ..


          వనవనమూ చుట్టి చుట్టి నగనగమూ తిరిగి తిరిగి


          ననలెల్లను గొని తెచ్చి,తనిపూవుల నేరియుంచి...దారి...


సెలయేటను తానమాడి, తెలినార కట్టి,


చెలిచెక్కిట చెయి జేర్చి,తలవాకిట నిక్కి చూచి..దారి..


           యెలగాలులు వీచినంత తలయెత్తి ఆలకించు,


           గలగల ఆకులు కదలిన అలికిడియా పదములదని..దారి...


దూరాననుందునంచు తరువెక్కి నిక్కి చూచు,


గిరిపై నిలుచుండి చూచు,కరమడ్డముగాగ చూచు..దారి..


          రారామ రామయంచు రాగలడిదె వచ్చెయంచు,


          రేబగళ్ళు తపియించుచు వాపోయెను వత్సరములు....దారి..


దినమొక కల్పంబుగా, క్షణమొక్క యుగంబుగా,


తనువెల్ల తపంబుగాగ, మనసెల్ల నిరాశగాగా..దారి...


          పరవ శి0చు తలపులతో, భయకంపిత మనముతో,


          పగళ్ళెల్ల యెదురుచూచు, నిశలెల్లను మెలుకొంచు..దారి.


చనుదెంచునొలెదో, తనుజూచునొ చూడదో,


అని తపించి జపియించుచు, అనుమానము పెంగొనగా..దారి..


          రా రామ రామ రామా..ప్రియదాసుల గావరావ,


          కానరాని శబరి ప్రేమ నుడియుడిగిన మూగ ప్రేమ..దారి..


....................


మా అమ్మ శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారు వ్రాసిన యీ పాట, అమ్మను యెరిగున్నవాళ్ళందరికీ, యెంతో ప్రీతిపాత్రమైన పాట! మా అయ్యకూడా, కళ్ళు మూసుకుని, తాదాత్మ్య స్థితిలో, భక్తి పారవశ్యంలో యీపాట వినటం-మేము గమనించిన సత్యం. అమ్మ 1983 లో (22nd March) తన శ్రీరామ సాన్నిధ్యానికి చేరుకున్నప్పుడు, మేమంతా, ఆమె శాశ్వత వియోగాన్ని భరించలేక-యీ పాటను అశృతప్త నయనాలతో పాడుతుంటే, అయ్య, చిన్న పిల్లవాడివలె, భోరున యేడ్వటం- అందరి హృదయాలూ తరుక్కుపోయిన క్షణాలు. కరణం, మా అయ్య జీవితానౌక, నిజమైన సరంగు అమ్మే కదా మరి! ఇల్లాలిగానూ, సాహితీపధ సహగామిగానూ, ఆ సరస్వతీపుత్రుని అంతర్వాహిని అంతశ్శక్తి కూడా ఆమే! ఆమే! అమ్మకు కన్నీటి నివాళీ!




Wednesday, 27 January 2016

Thursday, 14 January 2016

punnaga :         ...

punnaga :  
      ...
:                                        మా అయ్యగారి నోట రాసీమ మాట.. 1. ' ఒరే..వ...

Monday, 11 January 2016

punnaga :                                                  ...

punnaga :
                                                 ...
:                                                   ఓరి నీ పాసుగూలా?     ఇది అయ్య నోటినుండీ చాలా యెక్కువగా వినిపిస్తూ ఉండిన అచ్చమైన  రాసీమ ...

Wednesday, 23 December 2015


శ్రీ అరవిందులవారి రాష్ట్ర స్థాయి సమావేశాలలో మా అయ్యగారిపై శ్రీ అరవిందులవారి ప్రభావం గురించి కొన్ని అనుభూతులను పంచుకునేనుదుకు డిసెంబర్ 19,20 తేదీలలో చిత్తూరుకు వెళ్ళిరావటం జరిగింది. అక్కడ నేను పాల్గొన్నప్పటి చాయాచిత్రాల్లివి. చాల విశేషాలు చెప్పాలని ఉంది. రెండు రోజుల్లో అక్కడి మరిన్ని విశేషాలు వివరంగా వ్రాస్తాను. అరవిందులవారి దర్శనం అయ్య తరచుగా చేసుకున్నా, అక్కడ శ్రీ అరవిందులవారితో వారి అనుభవలను యెంత ప్రయత్నించినా సేకరించలేక పోవటం- యెంతో నిరాశను కలిగించినా, అయ్య దగ్గర అరవిందులవారి 'ఊర్వశి' చదివిన జ్ఞాపకాలు మధురమైనవి. పదాల పోహళింపూ, భావ గాంభీర్యతా- అనితర సాధ్యాలే కాక, అనుసరణకందనివి కూడా! అయ్యగారి భావజాలంలో అరవిందులవారి ప్రసక్తి సిద్ధాంతపరంగా, యెంతో సంక్లిష్టమైనదీ, సామాజిక ఆధ్యాత్మిక పరిశోధనతో కూడుకున్నది కూడా! అన్నట్టు, అక్కడ, మా అయ్యగారు, 1960లో వ్రాసిన విప్లవ యోగీశ్వరుడు, అన్న చిన్ని పొత్తము (ధర అమూల్యం) నా చేతులమీదుగా పునరావిష్కరింపబడటం- నా మహద్భాగ్యమే! ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులవారు యీ పుస్తక పునర్ముద్రణ చేయమని కార్యనిర్వాహకులకు, సూచించటం-ఆ విద్యాఖని   ఆదేశం అక్కడ పాటించటమూ- గొప్ప విషయం. అయ్య సంతానంలో ఒకదానిగా జన్మించటం- యెంత గొప్ప భాగ్యమో అవగతమౌతూ ఉంటుందిలాంటి సన్నివేశాలలో! చిత్తూరు వాసులే కాక, రాష్ట్రం లోని అనేక శ్రీ అరవింద సంస్థలనుండీ ప్రతినిధులెందరో పాల్గొన్నారక్కడ! దాదాపు, అందరికీ అయ్యతో యేదో ఒక జ్ఞాపకమూ, దాన్ని పదిలంగా గుర్తు పెట్టుకుని, నన్ను చూసిన వెంటనే వాళ్ళా సంగతి ప్రస్తావించటం చూస్తుంటే, అయ్య నిజంగా ప్రజాకవి అనే అనిపించిందండీ!
ఆచార్య కోవెలవారితో అయ్యగురించి, యెన్నో విషయాలు మాట్లాడుకోవటం  ఆనందాన్నిచ్చింది. వారు నన్నొక విషయమై దదాపు ఆజ్ఞాపించరనే అనవచ్చు. అదెమిటో త్వరలో చెబుతాగా!
ఇప్పటికీ ఫోటోలు చూడండి. ఫేస్ బుక్ స్నెహితులందరూ, పుస్తక ప్రదర్శన సందర్శనంలో చాలా బిజీగా ఉన్నారుకదామరి-మీ సమయం యెక్కువ తీసుకోకూడదనీ!  
ఇవిగో, యీ చాయాచిత్రాలు చూడండి, వీటి వివరణ త్వరలో!










Tuesday, 15 December 2015

   అరబిందో మహర్షి గురించి మా అయ్యగారు  విప్లవయోగీశ్వరుడు అని


ఒక చిన్న పొత్తము, 1960 లో వ్రాశారు. అరవిందులవారి అవతరణ-


 రామకృష్ణ పరమహంస మహాసమాధి- ఆగష్ట్ 15 నే కావటం 


 ఘుణాక్షర న్యాయం వంటిదని కొందరంటారు కానీ, భారతదేశ స్వాతంత్ర


 సిద్ధి కూడా అదెరోజు కావటంలో యెదొ పెద్ద సందేశమే ఉందని వారి భావన.
 
డ్రూయట్  దంపతుల వద్ద తానున్న సమయంలో షేక్స్ పియర్ రచనలను


 తెగ చదివేవారట అరవిందులవారు! టెన్నీసన్,  వర్డ్స్ వర్త్ షెల్లీ,


కీట్స్..వీళ్ళందరి హృదయాలనూ వారు ఆపోసన పట్టేశారట!


అరవిందులవారి జీవిత సంగ్రహం వ్రాస్తూనే,  తనవైన వ్యాఖ్యలను
 
కూడా అక్కడక్కడా ఆనాడే వినిపించేవారు-పుట్టపర్తి వారు.



        'దేశభాషలెంత గొప్పవైననూ, భారతీయాత్మను సంపూర్ణముగా



వెల్లడింపలేవు. '
        'సాహిత్యము,  హృదయమును సంస్కరించుచూ, భావములు



విశాలమొనర్చును. కానీ,  సాధన, మర్గములనుపదేశించును.'

        'ఒక దేశము యొక్క విజ్ఞానము,  వికాసమొందవలెనన్నచో,  నా దేశము



 స్వతంత్రముగానుండవలయును.  స్వాతంత్ర్యమే, సర్వాభ్యుదయమునకూ, 


మూలము.' 
       'శంకరులవారి  తరువాత, అరవిందులవంటి మేధావి,



 ప్రపంచమునబుట్టలేదు. అతను విశ్వామిత్రునివంటివాడు.


 రజప్రేరితమైన యీ తపస్సు-శుద్ధ సాత్వికమై, పరిణామపేశలమైనది.


 విశ్వామిత్రుడు గాయత్రిని సృష్టించినట్లే, యరవిందులు,  భాగవత జీవన


విధానమును, నిర్ణయించెను.'
    'హిమాలయము వంటి మేధస్సు, క్షీరసముద్రము  వంటి కవితాశక్తీ-



రెండింటినీ జోడించిన యరవిందుల  మూర్తి-చిత్రాతిచిత్రమైనది.' 

   ఇలాంటి యెన్నో పుట్టపర్తివ్యాఖ్యలతో కూడిన యీ చిన్ని పొత్తము,

 
చిత్తూరులో యి 19, 20వ తేదీలలో జరుగుతున్న


రాష్ట స్థాయి అరబిందో సంస్మరణ


సభల సందర్భంగా పునర్మిద్రింపబడుతున్నది.


(నేనుకూడా వెళ్తున్నాను.) 

  అరబిందో భావజాలాన్నీ, మార్క్క్ భావజాలాన్నీ కలిపి కొత్త సిద్ధంతాన్ని 



 యెవరైనా కనిపెడితే బాగుండేదనీ, తనకిప్పుడు అ విశ్లేషణ చేయదగినంత


మానసిక, దైహిక శక్తులు లెవనీ తన చివరి రోజుల్లో వాపోయేవారు  (ఈ దిశగా


యెవరైనా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడటం లేదింకా.) .


  అరవిందులవారి ప్రభావం పుట్టపర్తిమీద నిండుగా మెండుగా వుంది మరి... 

Monday, 14 December 2015

punnaga :               నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3...

punnaga :

              నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3

...
:               నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3 కడప మోచంపేట (అసలు పేరు మోక్షంపేట అట..క్రమంగా నోరుతిరగక అది మోచంపేటగా ప్రజల్లో స్థిర...

Thursday, 3 December 2015

Friendz dears....This post shows how thick was the


friendship of maa ayyagaru with Jammalamadakavaru.


....(courtesy- sri Ramavajhala Srisailam)









Wednesday, 2 December 2015


Part 5 (Final).of  Puttaparthi about Gurajada

కన్యక, పూర్ణమ్మ కథ రెండూ కరుణాత్మక కావ్యాలు.
 యెంతో గంభీరమైన భావాలను కూడా సూటిగా హృదయాలకు తాకేటట్లు తేటగా పిల్లలకు అర్థమయ్యేట్లు చెప్పడం గురజాడలోని మహా శక్తి. కన్యకలోని ఇతివృత్తాన్ని మరేవి ఐనా గంభీరమైన ప్రౌఢ కావ్యంగా మార్చి
వుండును. పూర్ణమ్మ కథలోని కరుణ మహ సుకుమరమైనది. దీనిలో యెత్తుగడ, అంతమూ- యెంతటి గంభీర హృదయాలనైన చలింపచేసేటంత లలితంగా వున్నయి. ఇంత సరళంగా, సూటిగా, సుకుమరంగా చెప్పగలగడం మహాకవులకు మత్రమే సాధ్యమౌతుంది. అ చిత్తవృత్తిలో అయన బాలసాహిత్యం వ్రాసివుంటే యెంత బాగుండునో ! (గురజాడ సాహిత్య విశిష్టతను పుట్టపర్తివారు ఆవిష్కరించిన తీరు చదువరులలో గురజాడవారిపట్ల అంతులెని గౌరవం పెంచటంతోపాటూ, పుట్టపర్తివారి బహు భాషావైదగ్ధ్యమూ, నిశిత పరిశీలనా శక్తి పట్ల కూడా ఆశ్చర్యానందాలు కలుగజేస్తుందనటంలో సందేహం లేదనిపిస్తుంది - నామట్టుకు నాకు ! యేమంటారు సహృదయ మిత్రులారా ! డా. వేదగిరి రాంబాబుగారు చాలాకాలంగా గురజాడవారి సహిత్యానికి అపారమైన సేవ చేస్తున్నారు. అనేకానేక ప్రాంతలలో, యెంతో శ్రమకోర్చి, సమావేశాలు నిర్వహించారు. ఇటీవల గురజాడవారి వర్ధంతి నాడు, (30th nov) శ్రీయుత విహారి, సుధామగారల సంపాదకత్వంలో ఆ మహనీయునికి సరికొత్త కథానిక, కవితానివాళులర్పించి కొత్త వొరవడిని సృష్టించారు. (కవితానివాళిలో నా చిన్న కవితకూ స్థానం దక్కటం నా అదృష్టంగా భావిస్తున్నాను.) సాంస్కృతిక రాజకీయ రంగలలో సవ్యసాచి శ్రీమాన్ రమణాచారిగారి నిండు ఆశీస్సులతో జరిగిన యీ వేడుక మరిన్ని కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతుందని ఆశిస్తూ...నాగపద్మిని పుట్టపర్తి)
..................... 











   Part 4 pl....
................
ఆయన ప్రయత్నించిన సామాజిక విప్లవం కూడా చాలా గొప్పది. తన కాలానికి   అతీతమైన సామాజిక దృష్టి ఆయనకుండేది. ఆయన కథలలో ఆ దృష్టి బాగా కనబడుతుంది.
 ఇక ఆయన హాస్యం తెలుగు సాహిత్యంలో సాటి లేనిది. ఆయన వుత్తరాలలో, వ్యాసాల్లోకూడా ఈ హాస్య దృష్టి కనబడుతుంది. సర్కస్ బఫూన్లు చేసే ఆంగిక వికారాలతోనూ,  కృతకమైన  శబ్ద చమత్కరాలతోనూ సృష్టించే హాస్యం అల్పమైనది. కన్యాశుల్కంలోని హాస్యం పాత్రల  స్వాభావిక ప్రవర్తనలోనూ, కథకు సహజమైన సన్నివేశాలతోనూ  ఇమిడి వుంది. ఇటువంటి హాస్యమే ఉత్కృష్టమైనది. గురజడ షృష్టించినట్టి హాస్యం నాజూకైన హాస్యం తెలుగులో మరిలేదు. గురజాడ కవిత్వంలో అంగ్ల సాహిత్యపు చాయలు వున్నయి. మొత్తం మీద ఇంగ్లీషు ప్రభావం ఆయనమీద యెక్కువగా వుందని చెప్పవచ్చు. ఆంగ్ల  విద్యమీద అయనకు అమితమైన గౌరవం. ఇది ఆనాటి కాల  ప్రభావమని చెప్పవచ్చు.  ఇంగ్లీషురాని పండితులు ఆనాడు  మహా చాందసులు. కూపస్థ మండూకాలు. ఇంగ్లీషు విద్య వచ్చినవారే అంతో ఇంతో విశాలంగా ఆలోచించగలిగేవాళ్ళు. ఇంగ్లీషువిద్య వల్లనే స్వతంత్ర ఆలోచనాశక్తీ, విశాల దృష్టీ అలవడుతాయని అనుకోవడం ఆనాటి పరిస్థితుల్లో   న్యాయమే! ఆనాటి యుగ స్వభావమే ఆయనలో ప్రతిఫలించింది.
   ముత్యాలసరాలు ఆయన తెలుగు కవిత్వానికి ఇచ్చిన కానుక.  ఆ చందస్సులో అంత కొత్తదనం లేకపోయినా బంధ కవిత్వాలూ, గర్భ కవిత్వాలూ  వ్రాసుకునే  రోజుల్లో సరళమైన గెయచందస్సులో కవిత్వం వ్రాయబూనుకోవడమే ఒక విప్లవం. అయన  సుభద్ర లో అక్కడక్కడా కావ్య  భాష దొర్లింది. ఋతు శతకం అనేది సామాన్యులకు అర్థమయ్యేట్లు లేదు. వీటిని ఆయన చిన్నప్పుడు అంటే సాహిత్యాన్ని గురించే ఆయన విశ్వాసాలు పరిణతి చెందక మునుపు వ్రాసినాడేమో అనిపిస్తుంది. అయన ఖండ కావ్యాలు యేవేవి యెప్పుడెప్పుడు వ్రాసిందీ తేదీలు కూడా లభ్యమై వుంటే బాగుండేది. 
(ఇంకా వుంది...)
 

Tuesday, 1 December 2015

Part 3
 

తెలుగులో నన్నయభట్టే ఆదికవి అని చాలారోజులు అనుకునేవాళ్ళం. నన్నయ భారతంవంటి ప్రౌఢరచన హఠాత్తుగా ఒకనాడు ఆవిర్భవించిందంటే నమ్మడం చాలా కష్టం. యెన్నో తరాలుగా యెంతమంది విస్మృత కవుల చేతిలోనో తెలుగు కవిత్వం క్రమ క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చి, నన్నయనాటికి, భారతం పరిపక్వ స్థితికి వచ్చిందనుకోవటం సమంజసం. ముఖ్యంగా బౌద్ధులూ, జైనులూ దేశీయ భాష ఐన తెలుగులో యెన్నో కావ్యాలు వ్రాసివుంటారని నా విశ్వాసం. ఆ యుగాలనాటి మతకలహాలలో హిందూ దురభిమానులు తమది పైచేయైనప్పుడు, ఆ సాహిత్యాన్నంతా నాశనం చేసి ఉంటారు. గురజాడ బతికి వున్నప్పుడే యుద్ధమల్లుని బెజవాడ శాసనం దొరికింది. యుద్ధమల్లుడే ఆదికవి అని ఆయన సాహసంగా గుర్తించినాడు. కన్నడంలోని పంపభారతం గురించికూడా ప్రస్తావించినాడు. నన్నయ భారతంలో పంపభారతం యొక్క ప్రభావం కనబడుతున్నదని కొన్ని యేండ్ల కిందట ఆలంపూర్ సాహిత్య సభలో నేను సోదాహరణంగా నిరూపించినప్పుడు తెలుగు భక్తులందరూ నా మీద విరుచుక పడినారు. నేనసలు తెలుగువాణ్ణే కాదనీ, మారువేషంలో వున్న కన్నడంవాణ్ణనీ నన్ను నిందించారు. నేను చెప్పిన అభిప్రాయం గురజాడ ఆనాడే వెలిబుచ్చినాడు. కానీ తెలుగువాళ్ళ దురభిమానం మితిలేనిది. నన్నయ మహాకవి అంటే వాళ్ళకు తృప్తిలేదు. నన్నయ ఋషి అనే చాదస్తులూ, నన్నయ దేవుడు అనే మూర్ఖులూ బయలుదేరినారు..

గురజాడ చిన్నప్పటినుండే ఇంగ్లీషులో గద్య పద్యాలలో రచనలు చేసేవాడు. సంస్కృతం బాగా రావటమే కాక సంస్కృత వ్యాకరణంతో కూడా మంచి పరిచయం వున్నట్టు వూహించవచ్చు. అనంద గజపతి మహా ప్రౌఢుడైన కవి. అయనచుట్టూ, దిగ్దంతులవంటి పండితుల గౌరవం పొందినాడంటే వారి పాండిత్యం సామాన్యంగా వుండదు.
గజపతి వంటివారు, గురజాడను ఆదరించడం ఒక ఆశ్చర్యమైన విషయం.
.....................

గురజాడ సాధించిన సాహిత్య విప్లవం చాలా గొప్పది. బాల వ్యాకరణ ప్రౌఢ వ్యాకరణ సూత్రాలకు లోబడిన ప్రయోగాలు తెలుగులో చాలా యెక్కువగా వున్నయి. ఆంధ్ర శబ్ద చింతామణి మొదలుకొని తెలుగు వ్యాకరణాలన్నీ చాలా సంకుచితమైన దృష్టి గలవి. మన వ్యాకర్తలు శైవ సాహిత్యాన్ని గుర్తించనేలేదు. కృష్ణరాయల తరువాత వచ్చిన ప్రబంధాలకూ, మధుర తంజావూరు రాజుల కాలంలో వచ్చిన వచన సాహిత్యనికీ వాళ్ళూ యేమాత్రమూ విలువ ఇవ్వలేదు. అందుకనే ఆ వ్యాకరణాలు అంత సంకుచితంగా తయారైనాయి. అసలు ఒక జీవద్భాషను వ్యాకరణ సూత్రాలలో బంధింపజూడటమే కుంజర యూధమును దోమ కుత్తుకలో యిరికించడానికి చేసే ప్రయత్నం వంటిది. జీవద్భష ఐన తెలుగులో అనంతమైన ప్రాంతీయ భేదాలున్నాయి. అట్లే, సంస్కృతంలోనూ పాణిని వ్యాకరణానికి వ్యతిరేకమైన ప్రయోగాలు అనేకం - వ్యాసునిలో, వాల్మీకిలో, అంతకు పూర్వపు వైదిక సాహిత్యంలో వున్నాయి. సంస్కృతం జీవద్భాషగా వున్న రోజుల్లో బౌద్ధ జైన వాజ్మయాలలొ యీనాటి మహాపండితులకు కూడా అర్థం తెలియని ప్రయోగాలు అనేకం చేయబడ్డాయి. కాబట్టి జీవన భాషను వ్యాకరణపు సంకెళ్ళలో బంధించబూనుకోవడం సాహితీపరులెవ్వరూ సహింపకూడని విషయం. యీదృష్టితో వ్యాకరణ భక్తులకు వ్యతిరేకంగా గురజాడచేసిన రచనలు తెలుగు సాహిత్యానికి నూత్న యౌవనం ప్రసాదించినాయి. సశేషం...(ఇది 1968 ప్రాంతాలలో కడపలో జరిగిన గురజాడ వర్ధంతి సభలో పుట్టపర్తివారు వెలువరించిన అభిప్రాయాలకు అభిప్రాయాలకు విశాలాంధ్ర వార్తా పత్రిక ప్రకటించిన విపుల వార్తా వ్యాఖ్యలోని భాగం)
                                                    2-12-15


Monday, 30 November 2015


.................
      గురజాడ దేశభక్తి గేయం చాలా గొప్పది. తెలెఉగులో  అటువంటిది మరి లేదు.  అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలోనే  అటువంటిది లేదనటానికి   సాహసించరాదు. అలగే మధురవాణి పాత్ర విషయం. మధురవాణి పాత్ర  గొప్పదేకానీ, వసంతసేన కంటే గొప్పదని నేననలేను. గురజాడకు కూడా ఇలాంటి అభిప్రాయాలున్నాయి. చాసర్   వాల్మికి వంటివాడని గురజాడ అభిప్రాయపడ్డాడు. చాసర్  మీద ఇంగ్లీషువాళ్ళకే లేని గౌరవం, యీయనకెందుకు కలిగిందో నాకు అర్థం కావటంలేదు. అట్లే వర్డ్సవర్త్ మీద కూడా గురజాడకు విపరీతమైన  గౌరవం. వర్డ్స్వర్త్ కు పూర్వం ఉన్న కవిత్వమంతా రాజుల రాణుల ప్రేమ పురాణాలూ, వీరగాధలే! సామాన్యుల జీవితాన్ని ప్రతిపాదించే  కావ్యాలు కూడా చాలావరకు యీవిధంగానే వుందనవచ్చు.  కానీ,  సంస్కృత  ప్రాకృతాల్లో మాగధి, అపభ్రంశ వంటి భాషల్లో సామాన్యుల గాధలు అనేకం ఉన్నాయి. జైన బౌద్ధ సాహిత్యమంతా సామాన్యుల కథలే !   ప్రసిద్ధమైన  గాధాసప్త శతి
   గురజాడ దేశభక్తి గేయం చాలా గొప్పది. తెలుగులో   అటువంటిది మరి లేదు.  అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలోనే  అటువంటిది లేదనటానికి   సాహసించరాదు. అలగే మధురవాణి పాత్ర విషయం. మధురవాణి పాత్ర  గొప్పదేకానీ, వసంతసేన కంటే గొప్పదని నేననలేను. గురజాడకు కూడా ఇలాంటి అభిప్రాయాలున్నాయి. చాసర్   వాల్మికి వంటివాడని గురజాడ అభిప్రాయపడ్డాడు. చాసర్  మీద ఇంగ్లీషువాళ్ళకే లేని గౌరవం, యీయనకెందుకు కలిగిందో నాకు అర్థం కావటంలేదు. అట్లే వర్డ్స్  వర్త్ మీద కూడా గురజాడకు విపరీతమైన  గౌరవం. వర్డ్స్  వర్త్ కు పూర్వం ఉన్న కవిత్వమంతా రాజుల రాణుల ప్రేమ పురాణాలూ, వీరగాధలే! సామాన్యుల జీవితాన్ని ప్రతిపాదించే  కావ్యాలు కూడా చాలావరకు యీవిధంగానే వుందనవచ్చు.  కానీ,  సంస్కృత  ప్రాకృతాల్లో మాగధి, అపభ్రంశ వంటి భాషల్లో సామాన్యుల గాధలు అనేకం ఉన్నాయి. జైన బౌద్ధ సాహిత్యమంతా సామాన్యుల కథలే !   ప్రసిద్ధమైన  గాధాసప్త శతి ఆనాటి సామాన్యుల జీవితాన్ని చిత్రించే మనోహర సంకలనం. తెలుగులో మాత్రం మొన్న మొన్నటివరకు కవులు రాజులదగ్గర వేశ్యలవలెనే బ్రతికినారని  చెప్పవచ్చు. కానీ  తెలుగు సాహిత్యమంతా అట్టి సాహిత్యం అనలేము. (To be continued.....Friendz dears...Pl. note that this is the NEWS ITEM published in VISALANDHRA daily, on the GURAJADA vardhanti sabha hela at Kadapa  prabably in 1968, preserved and given to me by Sri Ramavajhala srisailamgaru, last year. )